Adinarayana Reddy: జగన్ అనే వ్యక్తి మా జిల్లాలో పుట్టడమే దరిద్రం: ఆదినారాయణరెడ్డి

- వంశీని జగన్ పరామర్శించడంపై ఆదినారాయణరెడ్డి మండిపాటు
- జగన్ మళ్లీ జైలుకు వెళతారని వ్యాఖ్య
- జైలు గోడలు చూసేందుకు పరామర్శల పేరుతో జైలుకు వెళుతున్నారని ఎద్దేవా
వైసీపీ అధినేత జగన్ పై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మండిపడ్డారు. జగన్ లాంటి వ్యక్తి కడప జిల్లాలో పుట్టడమే దరిద్రమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ జైల్లో పరామర్శించడంపై ఆయన మండిపడ్డారు. వంశీ చేయని తప్పు లేదని అన్నారు. జైలు పక్షులన్నీ త్వరలోనే ఒకే చోటుకు చేరతాయని చెప్పారు. జగన్ త్వరలోనే మళ్లీ జైలుకు వెళతారని... అందుకే జైలు గోడలు చూసేందుకు పరామర్శల పేరుతో జైలుకు వెళుతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు.
జగన్ లాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని చెప్పారు. వైసీపీ అనేది డైనోసార్ పార్టీ అని అన్నారు. సొంత నియోజకవర్గం పులివెందులకు కూడా నీరు ఇవ్వలేని వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. పేదలకు ఇళ్లు ఇవ్వలేని జగన్... తన సొంతానికి మాత్రం ఆరు ప్యాలెస్ లు కట్టుకున్నారని ఎద్దేవా చేశారు.