Nadendla Manohar: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి E-KYC ప్రక్రియ: మంత్రి నాదెండ్ల

- ఎన్నికల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ ఇచ్చిన కూటమి
- గతేడాది దీపం పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- నేడు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి నాదెండ్ల సమావేశం
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు దీపం-2 పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు. వినియోగదారులు సిలిండర్ డెలివరీ సమయంలో నగదు చెల్లిస్తే, ఆ తర్వాత ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ చేస్తుంది.
కాగా, ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని సివిల్ సప్లై భవన్లో రాష్ట్ర స్థాయి ఆయిల్ మార్కెటింగ్ ప్రతినిధులు, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 'సూపర్-6' హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు.
ముఖ్యంగా ప్రతి ఆడబిడ్డకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామనే హామీని నెరవేర్చే లక్ష్యంతో "దీపం-2" పథకానికి శ్రీకారం చుట్టడం జరిగిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 2024 నవంబర్ 1న దీపం-2 పథకాన్ని ప్రారంభించారని... ఇప్పటిదాకా 93 లక్షల గ్యాస్ బుకింగ్స్ జరిగాయని... వినియోగదారుల ఖాతాల్లో రూ.714.57 కోట్ల రూపాయల నగదు జమ చేశామని చెప్పారు.
కాగా, దీపం-2 పథకం సద్వినియోగం కోసం E-KYC ప్రక్రియను అమలు చేయాలని, గ్యాస్ డెలివరీ బాయ్స్ సిలిండర్ డెలివరీ చార్జీలు వసూలు చేయకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరవేయడానికి, పథకాల అమలులో పారదర్శకత పెంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు.
24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో రూ.7508 కోట్లు జమ చేశాం: నాదెండ్ల
విజయవాడలోని సివిల్ సప్లై భవన్ లో రైస్ మిల్లర్స్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో నాదెండ్ల మాట్లాడుతూ... 5.21 లక్షల మంది రైతుల నుంచి 32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రూ. 7522 కోట్ల రూపాయల విడుదల చేశామని చెప్పారు. 24 గంటల్లోనే రూ.7,508 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. టెక్నాలజీ వాడకంతో తొలిసారిగా వాట్సాప్ ద్వారా ధాన్యం కొనుగోలు (7337359375) చేశామని వివరించారు.
కాగా, మధ్యాహ్న భోజనం, వెల్ఫేర్ హాస్టళ్లకు మంచి బియ్యం అందించనున్న ప్రభుత్వం నిర్ణయం పట్ల రైస్ మిల్లర్స్ హర్షం వ్యక్తం చేశారు