Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు'.. పవన్ ఫ్యాన్స్ కి ఏఎం రత్నం గుడ్న్యూస్!

- ముందుగా చెప్పినట్టుగానే మార్చి 28నే చిత్రాన్ని విడుదల చేస్తామన్న నిర్మాత
- పవన్ కు సంబంధించి మిగిలిన షూటింగ్ ను పూర్తి చేస్తున్నామని వెల్లడి
- ఈ మేరకు ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపిన ఏఎం రత్నం
పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమాపై చిత్ర నిర్మాత ఏఎం రత్నం తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా చెప్పినట్టు మార్చి 28నే థియేటర్లలోకి తీసుకువస్తామని ఆయన ప్రకటించారు. ఆ దిశగా పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఎం రత్నం మాట్లాడుతూ... "ఎవరికీ ఎటువంటి ఆందోళన అవసరం లేదు. అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేస్తాం. పవన్ కల్యాణ్ కు సంబంధించి మిగిలిన షూటింగ్ ను కూడా పూర్తి చేస్తున్నాం" అన్నారు.
ఇక ప్రేమికుల రోజు సందర్భంగా చిత్రం యూనిట్ కీలక అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా సెకండ్ సింగిల్ 'కొల్లగొట్టిందిరో' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ పాట కోసం పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు నిర్మాత మూవీ విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని చెప్పి, అభిమానులను మరింత ఖుషీ చేశారు.
కాగా, హరిహర వీరమల్లు చిత్రం పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్ర సగభాగానికి పైగా దర్శకత్వం వహించారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో మిగిలిన భాగానికి నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ స్వరకర్త కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ సరసన హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు.