Tirumala: తిరుమలలో వివిధ సేవల కోసం నేటి నుంచి లక్కీ డిప్ రిజిస్ట్రేషన్లు

- మే నెల అర్జితసేవా టికెట్ల కోటా నేడు విడుదల
- వర్చువల్ సేవలు, అంగ ప్రదక్షిణం, శ్రీవాణి టికెట్ల విడుదల తేదీల ప్రకటింపు
- వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు ఫిబ్రవరి 22న విడుదల
- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, గదుల కోటా ఫిబ్రవరి 24న విడుదల
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవల మే నెల లక్కీడిప్ కోటాను టీటీడీ మంగళవారం ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్సైట్ ttdevasthanams.ap.gov.in ద్వారా విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం 18 నుంచి 20వ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది. లక్కీడిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లిస్తేనే టికెట్లు మంజూరవుతాయని పేర్కొంది.
**వర్చువల్ సేవా టికెట్లు**
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు కోటాను ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
**అర్జిత సేవా టోకెన్లు**
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టోకెన్ల మే నెల కోటాను ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది.
**అంగ ప్రదక్షిణం టోకెన్లు**
అంగ ప్రదక్షిణం టోకెన్లకు సంబంధించి మే నెల కోటాను ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది.
**శ్రీవాణి ట్రస్టు టికెట్లు**
శ్రీవాణి ట్రస్టు ఆధ్వర్యంలో విడుదల చేసే టికెట్ల మే నెల కోటాను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
**వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్లు**
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి కోసం మే నెల ఉచిత ప్రత్యేక దర్శన టికెట్లను ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
**ప్రత్యేక దర్శన టికెట్లు**
మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
**తిరుమల, తిరుపతి గదుల కోటా**
తిరుమల మరియు తిరుపతిలో మే నెల గదుల కోటాను ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు.