New Delhi: ఏడాది పాపను ఎత్తుకొని ఢిల్లీ రైల్వే స్టేషన్లో మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ విధులు

- 15వ తేదీన రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటన
- తొక్కిసలాట ఘటన తర్వాత భద్రతను కట్టుదిట్టం చేసిన రైల్వే అధికారులు
- ఏడాది బిడ్డను ఎత్తుకొని చేతిలో లాఠీతో ప్లాట్ఫాంపై మహిళా కానిస్టేబుల్ రీనా విధులు
దేశ రాజధాని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఓ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ తన ఏడాది బిడ్డను ఎత్తుకొని విధులు నిర్వర్తిస్తున్న వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది. ఫిబ్రవరి 15వ తేదీన ఇక్కడి రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి పలువురు మృత్యవాత పడ్డారు. చాలామంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై స్పందించిన రైల్వే అధికారులు స్టేషన్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇలాంటి సమయంలో ఒక మహిళా కానిస్టేబుల్ తన బిడ్డను ఎత్తుకొని విధులు నిర్వర్తించారు. ఆమె లాఠీని చేతిలో పట్టుకొని ప్లాట్ఫాంపై నడుస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.
ఒక వ్యక్తి పట్టాలపై ఉన్న రైలుకు ఆనుకొని చల్లటి పానియం తాగుతుండగా ఆమె అతనిని హెచ్చరించి, పక్కకు రమ్మని చెప్పారు. ఆ తర్వాత లాఠీని పట్టుకొని ప్లాట్ఫాంపై నడుస్తూ కనిపించారు. చిన్నారిని ఎత్తుకొని విధులు నిర్వహిస్తున్న ఆమె పేరు రీనా. రీనాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.