Atishi: ఢిల్లీలో ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం గల నేతలు బీజేపీలో లేరు: అతిషి

- బీజేపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎవరికీ పాలనా సామర్థ్యం లేదని చురక
- 48 మందిలో ఒక్కరిపై కూడా మోదీకి విశ్వాసం లేదన్న అతిషి
- ప్రభుత్వాన్ని నడిపే సత్తా లేనివారు ప్రజల అభివృద్ధి కోసం ఎలా పని చేస్తారని ప్రశ్న
ముఖ్యమంత్రి పదవిని చేపట్టి ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం గల నేతలు ఎవరూ లేనందునే బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించడం లేదని మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిషి ఎద్దేవా చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపు పది రోజుల క్రితం వెలువడ్డాయి. విజయం సాధించిన బీజేపీ... సీఎం అభ్యర్థిని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో అతిషి స్పందించారు.
ఎన్నికల్లో గెలుపొందిన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో ఒక్కరిపై కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విశ్వాసం లేదని విమర్శించారు. అందుకే కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించడానికి బీజేపీ వెనుకడుగు వేస్తోందన్నారు. దేశ రాజధానిలోనే ప్రభుత్వాన్ని నడిపే సత్తాలేని వారు ఇక ప్రజల అభివృద్ధి కోసం ఎలా పనిచేస్తారని ప్రశ్నించారు. కాగా, ఈ నెల 20న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.