Mysuru: మైసూరులో కలకలం.. ఒకే ఇంట్లో విగతజీవులుగా నలుగురు కుటుంబ సభ్యులు!

- ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి
- ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం
- మృతులు చేతన్, అతని భార్య రూపాలి, కుమారుడు కుశాల్, తల్లి ప్రియంవదగా గుర్తింపు
కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఒకే ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు విగతజీవులుగా కనిపించడం కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ కుటుంబం ఇలా బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.
పూర్తి వివరాల్లోకి వెళితే.. విశ్వేశ్వరయ్య నగర్ లోని సంకల్ప్ సెరీన్ అపార్ట్మెంట్ లో నివాసముండే వ్యాపారి చేతన్ (45), అతని భార్య రూపాలి (43), కుమారుడు కుశాల్ (15), చేతన్ తల్లి ప్రియంవద (65) అప్పుల వారి బాధ భరించలేక బలవంతంగా తనువు చాలించారు. భార్య, కుమారుడు, తల్లికి విషం ఇచ్చి చంపిన తర్వాత చేతన్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే, బలవన్మరణానికి ముందు చేతన్ అమెరికాలో ఉండే తన సోదరుడికి ఫోన్ చేసి, తాము ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి, ఫోన్ కట్ చేశాడని పోలీసులు తెలిపారు. దాంతో అతని సోదరుడు పలుమార్లు తిరిగి కాల్ చేశాడు. కానీ, ఎలాంటి స్పందన రాలేదు. దాంతో స్థానికంగా నివాసం ఉంటున్న బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
అతని సమాచారంతో చేతన్ నివాసానికి వచ్చిన బంధువులు.. నలుగురు విగతజీవులుగా పడి ఉండడం చూసి బోరున విలపించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
అయితే, చేతన్ ఫ్యామిలీ గత 10 ఏళ్లుగా సంకల్ప్ సెరీన్ అపార్ట్మెంట్ లో నివాసముంటోందని, ఎప్పుడూ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లు కనిపించలేదని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.