Kerala: చర్చి ఆవరణలో తవ్వకాలు... బయటపడ్డ ప్రాచీన ఆలయ అవశేషాలు

- కాథలిక్ చర్చి ఆవరణలో బయటపట్ట శివలింగం, హిందూ మతపరమైన చిహ్నాలు
- ఆ ప్రదేశంలో పూజలు నిర్వహిస్తున్న హిందువులు
- పూజలు నిర్వహించడానికి అంగీకరించిన చర్చి పెద్దలు
కేరళలోని ఒక కాథలిక్ చర్చికి చెందిన భూమిలో పురాతన ఆలయ అవశేషాలు బయటపడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం, చర్చికి సంబంధించిన 1.8 ఎకరాల భూమిని కాసావా (టాపియోకా) సాగు కోసం దున్నుతుండగా, శివలింగంతో సహా అనేక మతపరమైన చిహ్నాలు వెలుగు చూశాయి. ఈ ప్రదేశం శ్రీ వనదుర్గా భగవతి ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో ఉంది.
చర్చికి సంబంధించిన స్థలంలో హిందూ ఆలయానికి చెందిన అవశేషాలు బయటపడటం చర్చకు దారితీసింది. దీనిపై శ్రీ వనదుర్గా భగవతి ఆలయ కమిటీ సభ్యుడు వినోద్ కేఎస్ మాట్లాడుతూ, వాస్తవానికి ఫిబ్రవరి 4న ఈ అవశేషాలు కనుగొనబడ్డాయని తెలిపారు. అయితే, రెండు రోజుల తర్వాత అక్కడ దీపాలు వెలిగించామని, అప్పుడే స్థానికులకు ఆ ప్రదేశం గురించి తెలిసిందని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, ఆలయ కమిటీ సభ్యులు చర్చి నిర్వాహకులతో సంప్రదింపులు జరిపారు. హిందూ సమాజం మనోభావాలను గౌరవిస్తూ అక్కడ పూజలు నిర్వహించుకునేందుకు చర్చి నిర్వాహకులు అంగీకరించారని వారు తెలిపారు. పలై డయోసెస్ ఛాన్సలర్ ఫాదర్ జోసెఫ్ కుట్టియాంకల్ కూడా ఆ స్థలంలో హిందువులు పూజలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీనిని స్థానికులు స్నేహపూర్వక వైఖరిగా అభివర్ణిస్తున్నారు.