Revanth Reddy: నరేంద్ర మోదీ కులంపై వ్యాఖ్యల దుమారం... రేవంత్ రెడ్డి వివరణ

- నరేంద్ర మోదీని నేను వ్యక్తిగతంగా తిట్టలేదన్న రేవంత్ రెడ్డి
- మోదీ పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పినట్లు వెల్లడి
- బీసీలపై చిత్తశుద్ధి ఉంటే జనగణనలోనే కులగణన చేయాలన్న ముఖ్యమంత్రి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులం మీద తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, బీసీ సంఘాల నేతలు విమర్శలు చేస్తుండటంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
మోదీని తాను వ్యక్తిగతంగా తిట్టలేదని అన్నారు. మోదీ పుట్టుకతో బీసీ కాదని మాత్రమే చెప్పానని వెల్లడించారు. ఆయన పుట్టుకతో బీసీ కాదు కాబట్టే బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నట్లు తెలిపారు. కానీ తన వ్యాఖ్యలను కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీలపై ప్రధాన మంత్రికి చిత్తశుద్ధి ఉంటే జనగణనలోనే కులగణన చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులగణన సమగ్రంగా నిర్వహించామని ఆయన అన్నారు. ఇందులోని వివరాల ఆధారంగా భవిష్యత్తులో కమిషన్ లేదా కమిటీ వేసి ప్రజలకు సంక్షేమ ఫలాలు ఎలా చేరువ చేయాలనే అంశంపై కసరత్తు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
తెలంగాణలో జరిగిన కుల గణన దేశానికి రోడ్డు మ్యాప్ అన్నారు. కుల గణన ద్వారా ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తున్నామని అన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్లుగా కచ్చితంగా చేస్తానని ఆయన అన్నారు. రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు రాలేదని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకువస్తామని అన్నారు.