Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకుంటాం: విజయవాడ పోలీస్ కమిషనర్

- వంశీపై కస్టడీ పిటిషన్ వేస్తామన్న విజయవాడ సీపీ
- వంశీ కేసుపై టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని వెల్లడి
- ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఉన్న వంశీ
కిడ్నాప్ కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ... వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకుంటామని చెప్పారు. వంశీని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించామని... నేరం చేసిన ఎవరైనా తప్పించుకోలేని విధంగా టెక్నాలజీ ఉందని తెలిపారు.
కేసు విచారణలో ఫోన్ కాల్స్, సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ఏ కారు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడకు వెళ్లింది? అనేది టెక్నాలజీ ద్వారా క్లియర్ గా తెలిసిపోతుందని అన్నారు. వంశీ కేసుపై టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని తెలిపారు. వల్లభనేని వంశీపై కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తామని... పోలీస్ కస్టడీకి తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను పేర్కొన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని వంశీ బెదిరించినట్టు తెలిపారు. వంశీకి చట్టాలపై గౌరవం లేదని పేర్కొన్నారు.