Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ... తొలి భారత కెప్టెన్ గా అరుదైన రికార్డు!

- 4 సార్లు వన్డే సిరీస్ లను క్లీన్స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్ గా రోహిత్
- వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లండ్ లపై ఈ ఘనత
- ఆ తర్వాతి స్థానాల్లో మూడేసి వైట్ వాష్ లతో కోహ్లీ, ధోనీ
మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ తో బుధవారం జరిగిన చివరి వన్డేలో భారత జట్టు 142 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా 3-0 తేడాతో సిరీస్ ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
అత్యధికంగా నాలుగు సార్లు వన్డే సిరీస్ లను క్లీన్స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్ గా నిలిచాడు. వెస్టిండీస్ (2022), శ్రీలంక (2023), న్యూజిలాండ్ (2023), ఇంగ్లండ్ (2025)పై ఈ ఘనత సాధించాడు. దాంతో వన్డేల్లో నాలుగు వేర్వేరు ప్రత్యర్థులను వైట్ వాష్ చేసిన మొదటి భారత కెప్టెన్ కూడా రోహిత్ అయ్యాడు. తర్వాతి స్థానాల్లో మూడేసి క్లీన్స్వీప్ లతో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నారు.
కాగా, గత 14 ఏళ్లలోనూ అత్యధిక క్లీన్స్వీప్ లు సాధించిన జట్టుగా టీమిండియా (12) నిలిచింది. న్యూజిలాండ్ 10 క్లీన్ స్వీప్ లతో రెండో స్థానంలో ఉంది.
ఇక ఇంగ్లండ్ పై ఈ భారీ విజయంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ తమ సన్నద్ధతను ఘనంగా ముగించినట్లైంది. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టోర్నీలో రోహిత్ సేన తన మొదటి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో 20న దుబాయ్ లో ఆడనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 23న దాయాది పాకిస్థాన్ తో తలపడనుంది.