Rahul Gandhi: ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు

Rahul Gandhi summoned by Lucknow court over his remarks against Army

  • భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆర్మీపై రాహుల్ వ్యాఖ్యలు
  • సైన్యాన్ని రాహుల్ అవమానించారంటూ బీఆర్‌వో మాజీ డైరెక్టర్ ఫిర్యాదు
  • మార్చి 24న తమ ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశం

భారత ఆర్మీని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నమోదైన కేసులో లక్నో లోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సమన్లు జారీచేసింది. మార్చి 24న తమ ముందు హాజరు కావాలని రాహుల్‌ను ఆదేశించింది. ‘భారత్ జోడో యాత్ర సందర్భంగా డిసెంబర్ 2022లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ భారత ఆర్మీని అవమానించేలా వ్యాఖ్యలు చేశారని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌వో) మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ ఫిర్యాదు చేశారు.

రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలతో భారత ఆర్మీని అవమానించారని శ్రీవాస్తవ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జాతీయ సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుతున్న ఆర్మీపై రాహుల్ వ్యాఖ్యలు తగవని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఏసీజేఎం) కోర్టు రాహుల్‌కు తాజాగా సమన్లు జారీ చేసింది. 

2022 డిసెంబర్ 9న రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ.. చైనా గురించి మీడియా తనను ఏమీ అడగదని తన స్నేహితుడితో పందెం కట్టానని పేర్కొన్నారు. 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూమిని ఆక్రమించిన దేశం గురించి, మన సైనికులను చంపిన దేశం గురించి, అరుణాచల్ ప్రదేశ్‌లో మన సైనికులపై దాడి చేస్తున్న దేశం గురించి ‘ప్రెస్’ తననేమీ అడగదని పేర్కొన్నారు. తాను చెప్పింది నిజమేనని, దేశం గమనిస్తోందని, వేరేలా ఆలోచించవద్దని రాహుల్ పేర్కొన్నారు. 

రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సైన్యం కూడా తీవ్రంగా స్పందించింది. 2022 డిసెంబర్ 12న రాహుల్ వ్యాఖ్యలపై ఆర్మీ స్పష్టత నిచ్చింది. చైనా ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్‌లోకి అక్రమంగా ప్రవేశించిందని, ఇండియన్ ఆర్మీ దానిని బలంగా తిప్పకొట్టిందని పేర్కొంది. 

  • Loading...

More Telugu News