electric two wheelers: తిరుమల శ్రీవారికి కానుకగా బైకులు

- టీవీఎస్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని అందించిన చెన్నై టీవీఎస్ సంస్థ చైర్మన్ వేణు శ్రీనివాసన్
- ఎన్డీఎస్ ఎకో సంస్థ ద్విచక్ర వాహనాన్ని అందించిన సంస్థ చైర్మన్ ఎంహెచ్ రెడ్డి
- ద్విచక్ర వాహన దాతలను అభినందించిన ఏఈవో వెంకయ్య చౌదరి
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తమ శక్తి మేరకు కానుకలు సమర్పిస్తుంటారు. వ్యాపార, వాణిజ్య ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు భారీగా విరాళాలు అందజేస్తుంటారు. భక్తులు స్వామివారికి ఎక్కువగా నగదు, నగలు కానుకలుగా సమర్పిస్తుండగా, తాజాగా మంగళవారం శ్రీవారికి ఖరీదైన రెండు బైక్లు కానుకగా వచ్చాయి.
చెన్నైకి చెందిన టీవీఎస్, బెంగళూరుకు చెందిన ఎన్డీఎస్ ఎకో సంస్థలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విరాళంగా సమర్పించాయి. ఆయా సంస్థల ప్రతినిధులు మంగళవారం టీటీడీ అధికారులకు రెండు ద్విచక్ర వాహనాలను విరాళంగా అందజేశారు. టీవీఎస్ అందించిన ఐక్యూబ్ ఎక్స్ వాహనం ధర రూ.2.70 లక్షలు కాగా, ఎన్డీఎస్ ఎకో అందించిన వాహనం ధర రూ.1.56 లక్షలు అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఆలయం వద్ద వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బైక్ తాళాలను టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఏఈవో వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఎండీ సుదర్శన్, తిరుమల డీఐ సుబ్రహ్మణ్యం, ఎన్డీఎస్ ఎకో సంస్థ చైర్మన్ ఎంహెచ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


