Trisha: త్రిష పొరపాటు చేసిందంటున్న ఫ్యాన్స్!

- 'ఐడెంటిటీ'లో నటించిన త్రిష
- అంతగా ప్రాధాన్యత లేని పాత్ర
- అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్
- 'పట్టుదల' ఫ్లాప్ కావడం పట్ల అసహనం
త్రిషకి తెలుగు .. తమిళ భాషల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. హీరోయిన్ గా ఇక ఆమె పని అయిపోయిందని అంతా అనుకున్నారు. దాంతో ఆమె లేడీ ఓరియెంటెడ్ కథలను చేస్తూ ముందుకు వెళ్లడం మొదలుపెట్టింది. అయితే గ్లామర్ కాపాడుకుంటూ, మళ్లీ అందరూ తన వైపు తిరిగి చూసేలా చేసుకుంది. అప్పటి నుంచి ఆమె ప్రయాణం మరింత జోరుగా సాగడం మొదలైంది. పెద్ద బ్యానర్లు .. పెద్ద హీరోల సరసన నాయికగా అవకాశాలు సంపాదించుకుంటూ వెళుతోంది.
రజనీకాంత్ .. విజయ్ .. అజిత్ వంటి స్టార్ హీరోలతో ఆమె జోడి కట్టింది. మలయాళంలో టోవినో థామస్ తో కలిసి 'ఐడెంటిటీ' సినిమాలోనూ చేసింది. అయితే ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర ఆమెకి విమర్శలను తెచ్చిపెట్టింది. అఖిల్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ఏడాది జనవరి 2వ తేదీన థియేటర్లకు వచ్చింది. రీసెంటుగా ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమా చూసిన తెలుగు అభిమానులు, ఈ పాత్రకి ఓకే చెప్పడం త్రిష చేసిన పొరపాటు అనే అంటున్నారు.
సెకండ్ ఇన్నింగ్స్ లోను త్రిష క్రేజ్ .. ఆమె అందుకునే పారితోషికం మామూలుగా లేవు. అలాంటి పరిస్థితుల్లో ఆమె 'ఐడెంటిటీ' చేసింది. టోవినో థామస్ పెద్ద హీరో అయినప్పటికీ, ఆ సినిమాలో అతని ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగంగా మాత్రమే త్రిష కనిపిస్తుంది. హంతకుడిని చూసిన ఆమె, అతని పోలికలను పోలీసులకు చెప్పడమే ఆ పాత్ర పని. ఏ మాత్రం విషయం లేని ఆ పాత్రకు త్రిష ఎలా ఒప్పుకుందంటూ ఫ్యాన్స్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రీసెంటుగా అజిత్ తో ఆమె చేసిన 'పట్టుదల' సినిమా కూడా ఫ్లాప్ కావడం పట్ల వాళ్లు మరింత అసంతృప్తితో ఉన్నారు. వాళ్లను కూల్ చేయాలంటే 'విశ్వంభర' రావాలేమో.