Indo Pak Rivalry: మైదానంలో సరదాగా కాసేపు.. అక్తర్, హర్భజన్ బాహాబాహీ.. ఇదిగో వీడియో!

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే అభిమానుల్లో ఓ రేంజ్లో క్యూరియాసిటీ ఉంటుంది. దాయాదుల పోరు అంటే మోత మోగిపోవాల్సిందే. ఇక ప్లేయర్ల మధ్య అయితే మాటల యుద్ధమే. ఇరు దేశాల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఇలాంటి ఘటనలు ఎన్నో గతంలో చోటు చేసుకున్నాయి కూడా.
తాజాగా పాక్ లెజెండరీ పేసర్ షోయబ్ అక్తర్, భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ కూడా ఒకరినొకరు నెట్టుకుంటూ బాహాబాహీకి దిగారు. కానీ, ఇది సీరియస్గా కాదు. కేవలం సరదాగా.. ఇలా ఒకప్పటి ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు గొడవ పడ్డారు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్ స్టేడియంలో వీరిద్దరూ ఇలా సరదాగా గడిపారు.
ఇందుకు సంబంధించిన వీడియోను అక్తర్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'ఛాంపియన్స్ ట్రోఫీకి మేమిలా సిద్ధమవుతున్నాం' అనే క్యాప్షన్ తో ఈ వీడియోను షేర్ చేశాడు. దీంతో ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఇక ఈ నెల 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా భారత్, పాక్ మధ్య హైవోల్టేజీ మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరగనుంది.