Govt Teacher: మహిళతో సహజీవనం... ఆమె కూతుళ్లపై అత్యాచారం.. హెచ్ఐవీ సోకడంతో బయటపడ్డ టీచర్ నిర్వాకం

- సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణం
- మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన ప్రబుద్ధుడు
- తల్లితో చెబితే చంపేస్తానంటూ బెదిరింపులు
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో అమానవీయమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళతో సహజీవనం చేస్తూ ఆమె కూతుళ్లపై అత్యాచారం చేశాడో ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆరేళ్లుగా సాగిన ఈ దారుణానికి తాజాగా తెరపడింది. రక్తపరీక్షలో ఆ ప్రబుద్ధుడికి హెచ్ఐవీ సోకినట్లు తేలడంతో ఆ బాలికలు ఇద్దరూ తమపై జరుగుతున్న అకృత్యాలను తల్లికి చెప్పారు. దీంతో ముగ్గురూ కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. భార్య చనిపోవడంతో మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. సదరు మహిళకు 19, 15 ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారు కూడా తల్లితో పాటే ఉంటున్నారు. ఈ క్రమంలో మహిళతో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న ఆ ఉపాధ్యాయుడు అత్యంత నీచానికి పాల్పడ్డాడు. తల్లి లేని సమయంలో మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడు.
తల్లితో చెబితే చంపేస్తానని బెదిరించి, బాలికలపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల ఆ ప్రబుద్ధుడు వైద్య పరీక్షలు చేయించుకోగా హెచ్ఐవీ సోకినట్లు తేలింది. ఈ విషయం తెలిసి బాలికలు ఆందోళన చెంది తల్లికి విషయం చెప్పారు. తమపై జరుగుతున్న ఘోరాన్ని బయటపెట్టారు. ఈ విషయం తెలిసి షాక్ అయిన సదరు మహిళ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.