Dokka Manikya Vara Prasad: వైసీపీలో చేరిన శైలజానాథ్ కు డొక్కా మాణిక్య వర ప్రసాద్ కీలక సూచన

- వైసీపీలో విలువలు, విశ్వనీయతలు ఉండవన్న డొక్కా
- పార్టీలో చేరిన తర్వాత జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారని విమర్శ
- శైలజానాథ్ వైసీపీలో చేరకపోవడమే మంచిదని సూచన
మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ఈరోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ మాట్లాడుతూ... ఒక మిత్రుడిగా శైలజానాథ్ కు ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నానని... వైసీపీలో విలువలు, విశ్వసనీయతలు ఉండవని... పార్టీలో చేర్చుకునే ముందు ఎంతో ఆప్యాయంగా ఉంటారని... ఆ తర్వాత జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారని చెప్పారు.
వైసీపీలో ఇప్పటికే 74 మంది నేతలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని డొక్కా అన్నారు. దళితులకు ఆ పార్టీలో విలువ ఉండదని చెప్పారు. దళితులకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ వైసీపీ అని వ్యాఖ్యానించారు. శైలజానాథ్ కు రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఆ పార్టీలో చేరకపోవడమే మంచిదని సూచించారు.
కాగా, శైలజానాథ్ ను శింగనమల వైసీపీ ఇన్ఛార్జ్ గా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే... ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది. గత 30 ఏళ్లుగా ఇదే సెంటిమెంట్ కొనసాగుతోంది.