KTR: కేసీఆర్ ఆదేశాలతో కేంద్ర మంత్రిని కలిశాం: కేటీఆర్

- ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్
- యూజీసీ నిబంధనలను మార్చడంపై అభ్యంతరాలను ధర్మేంద్ర ప్రధాన్ కు తెలియజేశామని వెల్లడి
- రాష్ట్ర ప్రజలు ఉప ఎన్నికలు కోరుకుంటున్నారని వ్యాఖ్య
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఆయన పలువురు నేతలను కలిశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశామని... యూజీసీ నిబంధనలను మార్చడంపై తమ అభ్యంతరాలను తెలియజేస్తూ వినతి పత్రాన్ని అందజేశామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరించేలా కొన్ని నిబంధనలు ఉన్నాయని అన్నారు. గవర్నర్లకు అధికారాలు కట్టబెడుతూ రాష్ట్రాల పరిధిలో ఉన్న యూనివర్సిటీల్లోని నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. తమ అభిప్రాయాలను యూజీసీకి కూడా తెలిపామని చెప్పారు.
రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయించిన నేతలకు సుప్రీంకోర్టు ఆదేశాలతో నోటీసులు జారీ అయ్యాయని... వారిపై అనర్హత వేటు పడాల్సిందేనని అన్నారు. సాయంత్రం ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు బయల్దేరుతామని తెలిపారు.