Brahmanandam: థియేటర్స్ షేక్ అయ్యే విలనిజం.. బ్రహ్మానందం వ్యాఖ్యలు వైరల్!

- ‘బ్రహ్మా ఆనందం’ మూవీ మీడియా సమావేశంలో విలన్ రోల్పై మాట్లాడిన బ్రహ్మీ
- త్వరలోనే భయంకరమైన విలన్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తానని వెల్లడి
- ‘బ్రహ్మా ఆనందం’ సినిమా కోసం తాతగా మారిన బ్రహ్మానందం
- తాతా మనవళ్లుగా నటిస్తున్న తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, గౌతమ్
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇటీవల తన కుమారుడు రాజా గౌతమ్ నటించిన ‘బ్రహ్మా ఆనందం’ మూవీ యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ చిత్రంలో బ్రహ్మీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మీడియా సమావేశంలో తాను విలన్ రోల్లో నటించడంపై బ్రహ్మానందం చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
ఇప్పటివరకు కామెడీ, సెంటిమెంట్ పాత్రలతో అలరించిన తాను త్వరలోనే ప్రతినాయకుడిగానూ కనిపిస్తానని చెప్పారు. ఆ విలనిజం థియేటర్ అంతా షేక్ అయ్యేలా ఉంటుందని అన్నారు. హాస్యభరిత పాత్రలతోనే అందరికీ చేరువైన ఆయన కొత్త పాత్రలో ఎలా సర్ప్రైజ్ చేస్తారోనని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
‘బ్రహ్మా ఆనందం’ సినిమా విషయానికి వస్తే... ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ తెరకెక్కించారు. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హిట్ చిత్రాలతో సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థగా పేరొందిన స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను నిర్మించారు.
ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నిజ జీవితంలో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, గౌతమ్ ఈ మూవీలో తాతా మనవళ్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘బ్రహ్మా ఆనందం’ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది.