Allu Arjun: స్పోక్స్ పర్సన్ ఐడియా ఏంటి 'పుష్ప రాజ్'.. ఇక్కడ కుదురుతుందా?

- అల్లు అర్జున్కు స్పోక్స్ పర్సన్ను హైర్ చేస్తున్నామని ప్రకటించిన బన్నీ వాస్
- స్పోక్స్ పర్సన్ ఐడియాపై వినిపిస్తున్న పలు విమర్శలు
- త్వరలోనే మీడియా ముందుకు బన్నీ స్పోక్స్ పర్సన్
కొన్ని ఐడియాలు వినగానే కొంచెం కొత్తగా అనిపించినా.. ఎందుకో కొన్ని ఆలోచనల విషయంలో 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన మేనరిజం 'ఇది అస్సలు బాగోదు' అనే డైలాగ్ గుర్తొస్తుంది. 'తండేల్' సినిమా ప్రమోషన్లో భాగంగా నిర్మాత, అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీ వాస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో త్వరలో అల్లు అర్జున్కు ఒక స్పోక్స్ పర్సన్ను హైర్ చేస్తున్నామని, హీరోకు సంబంధించిన ఏ విషయాలు అయినా అతను అఫీషియల్గా మాట్లాడతాడని చెప్పారు. ఇది వినగానే బహుశా చాలా మందికి ఐడియా కొత్తగా అనిపించినా, ఈ ఐడియా ఇక్కడ బాగోదేమో అనిపించించి ఉంటుంది.
'పుష్ప' చిత్రంతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు హీరో అల్లు అర్జున్. ఈ చిత్రంతో బాలీవుడ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయనకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక 'పుష్ప-2' చిత్రానికి బాలీవుడ్తో పాటు ఇండియా లెవెల్లో ఎలాంటి బజ్, హైప్ వచ్చిందో అందరికి తెలిసిందే. అంతేకాదు, ఈ చిత్రం కేవలం నార్త్ ఇండియాలోనే రూ.800 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డులను సృష్టించింది. అల్లు అర్జున్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్స్టార్స్ గా ఎదిగాడు. ఈ చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కొడుకు శ్రీతేజ్ త్రీవంగా గాయపడి హస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సంఘటనకు అల్లు అర్జున్ను బాధ్యుడిని చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హీరోపై కేసు నమోదు చేసి, అరెస్టు చేయడం, జైలుకు వెళ్లడం, బెయిల్ రావడం.. ఈ ఎపిసోడ్ల గురించి తెలిసిందే. అయితే అల్లు అర్జున్ జైలు నుంచి వచ్చిన తరువాత ఆయన్ని అందరూ వచ్చి పరామర్శించడం, దీంతో పాటు కేసు కోర్టులో ఉన్నప్పుడు ఆయన ప్రెస్మీట్ పెట్టి మీడియాతో మాట్లాడటం పట్ల తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక పుష్ప-2కు సంబంధించిన ప్రమోషన్స్లో కూడా అల్లు అర్జున్ పెద్దగా పాల్గొనలేదు. ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోవడం విశేషం. అయితే పుష్ప-2లో ఆయన నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. దాదాపు 1892 కోట్ల రూపాయాలు వసూలు చేసి ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ఈ సినిమా కొత్త రికార్డును నెలకొల్పింది.
కాగా సంధ్య థియేటర్ సంఘటన తరువాత తనపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలతో పాటు భవిష్యత్ కార్యాచరణను తెలియజేయడానికి... ఆ విషయాలు మీడియా ముందు మాట్లాడటానికి ఓ స్పోక్స్ పర్సన్ను హైర్ చేసుకోబోతున్నాడట. ఇదే విషయాన్ని ఆయన సన్నిహితుడు బన్నీ వాస్ తెలిపారు. అయితే ఈ విషయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అందరికీ సోషల్ మీడియా అందుబాటులో ఉంది. ఏ సెలబ్రిటి ఏ విషయం చెప్పాలనుకున్నా సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ద్వారా చెప్పొచ్చు. లేదా అధికారికంగా ఓ ప్రెస్నోట్ను రిలీజ్ చేసే అవకాశం కూడా ఉంది.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే అల్లు అర్జున్ తను చెప్పాలనుకున్న సమాచారాన్ని తన టీమ్, లేదా సొంత ఎక్స్ ఖాతా ద్వారానో లేదా ఇన్స్టాలో పోస్ట్ చేసి తెలియజేయవచ్చు. కానీ ఇండియలో ఏ హీరోకు లేని ఈ స్పోక్స్ పర్సన్ కాన్సెప్ట్ ఏంటీ? అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. అంతేకాదు స్పోక్స్ పర్సన్ మాట్లాడటం, అతని ఇంటర్వ్యూలు తీసుకోవడం విషయంలో కూడా మీడియా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.. చూద్దాం.. ఈ కాన్సెప్ట్ సక్సెస్ అవుతుందా? లేదా? అనేది!