Abhishek Sharma: విరాట్ కోహ్లీ ఆల్టైమ్ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ!

- వాంఖడేలో ఇంగ్లండ్ బౌలర్లను వణికించిన అభిషేక్
- 54 బంతుల్లోనే 135 పరుగుల తుపాన్ ఇన్నింగ్స్
- ఐదు మ్యాచ్ లలో కలిపి 279 పరుగులు చేసిన యువ ఓపెనర్
- భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా రికార్డు
- ఇంతకుముందు కోహ్లీ (231) పేరిట ఈ రికార్డు
ఇంగ్లండ్తో జరిగిన ఐదు మ్యాచ్ ల సిరీస్లో అద్భుతంగా రాణించిన టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ.. జట్టు 4-1తో సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఐదో టీ20లో ఈ పంజాబీ పుత్తర్ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 54 బంతుల్లోనే 135 పరుగులు బాదాడు. అభి తుపాన్ ఇన్నింగ్స్లో ఏకంగా 13 సిక్సర్లు నమోదు కావడం విశేషం. ఇది అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో ఏ భారతీయ బ్యాటర్ సాధించని అత్యధిక సిక్సర్లు.
మొత్తంగా ఈ సిరీస్లో ఐదు మ్యాచ్ లలో కలిపి అభిషేక్ 279 రన్స్ చేశాడు. తద్వారా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆల్టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. 2021లో ఇంగ్లండ్తో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్లో కోహ్లీ 231 పరుగులు చేశాడు.
ఓవరాల్గా తిలక్ వర్మ ఒక టీ20 సిరీస్ (ఏ జట్టుపైనైనా)లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. గతేడాది దక్షిణాఫ్రికాపై కేవలం 4 ఇన్నింగ్స్ల్లోనే అతను 280 పరుగులు చేశాడు. ఇందులో వరుసగా రెండు సెంచరీలు నమోదు కావడం విశేషం.
టీమిండియా తరఫున ఒక టీ20 సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు
280 - తిలక్ వర్మ (4 ఇన్నింగ్స్) వర్సెస్ దక్షిణాఫ్రికా, 2024
279 - అభిషేక్ శర్మ (5 ఇన్నింగ్స్) వర్సెస్ ఇంగ్లాండ్, 2025
231 - విరాట్ కోహ్లీ (5 ఇన్నింగ్స్) వర్సెస్ ఇంగ్లాండ్, 2021
224 - కెఎల్ రాహుల్ (5 ఇన్నింగ్స్) వర్సెస్ న్యూజిలాండ్, 2020