Botsa: కేంద్ర బడ్జెట్ పై మండిపడ్డ మాజీ మంత్రి బొత్స

AP Former Minister Botsa Satyanarayana Press Meet

  • బీహార్ కు భారీగా లబ్ధి.. మరి ఏపీకి ఏమిచ్చిందని ప్రశ్న
  • టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవంటూ విమర్శ
  • రాష్ట్రంలో కూటమి సర్కారు ఉన్నా, అందులో టీడీపీకి పదహారు మంది ఎంపీలు ఉన్నా నిధులు తీసుకురాలేకపోయారని మండిపాటు

కేంద్ర ప్రభుత్వం శనివారం లోక్ సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీకి నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బీహార్ కు కేంద్రం వరాల జల్లు కురిపించిందని గుర్తుచేస్తూ.. రాష్ట్రంలో కూటమి సర్కారే ఉన్నా, అందులో టీడీపీకి పదహారు మంది ఎంపీలు ఉన్నా నిధులు తీసుకురావడంలో వారంతా విఫలమయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామ్య పార్టీనే అని బొత్స గుర్తుచేశారు. అయితే, టీడీపీకి రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఈ బడ్జెట్ తో తేలిపోయిందన్నారు. టీడీపీ ప్రాధాన్యాలు వేరే అని చెప్పారు. బీహార్ తో పోల్చుకుంటే ఏపీకి ఈ బడ్జెట్ లో దక్కిన వాటా శూన్యమని చెప్పారు.

బడ్జెట్ ప్రసంగం ప్రారంభిస్తూ సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురజాడ అప్పారావు కవిత ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ చదవడం సంతోషకరమని బొత్స చెప్పారు. ఏపీకి చెందిన మహాకవిని సభలో ప్రస్తావించారు కానీ రాష్ట్రానికి కేటాయింపులు మాత్రం మరిచిపోయారని విమర్శించారు. బడ్జెట్ లో అసలు ఏపీ ప్రస్తావనే లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదించడంపైనా బొత్స మండిపడ్డారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తుంటే కేంద్రం దానిని 41 మీటర్లకు కుదిస్తూ నిధుల కేటాయింపునకు అంగీకరించిందని తెలిపారు. ఈ విషయాన్ని కూడా కొంతమంది నేతలు ఘనంగా చెప్పుకోవడం వింటుంటే చాలా బాధ అనిపించిందని బొత్స చెప్పారు.


Botsa
YSRCP
Union Budget
Andhra Pradesh
Polavaram Project
TDP

More Telugu News