Roja: గతంలో పవన్ ఏమన్నాడో ఓసారి గుర్తుచేసుకుందాం: రోజా

- నేడు వార్షిక బడ్జెట్ ప్రకటించిన కేంద్రం
- ఏపీకి కేటాయింపులపై రోజా స్పందన
- పవన్ గతంలో చెప్పిన మాటలను ఇప్పుడెందుకు చెప్పలేకపోతున్నాడంటూ ట్వీట్
నేడు కేంద్ర బడ్జెట్ ప్రకటించిన నేపథ్యంలో, ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా స్పందించారు. ఆమె డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు.
గతంలో వైసీపీ ఎంపీలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ఏమన్నాడో ఓసారి గుర్తుచేసుకుందాం అంటూ రోజా ట్వీట్ చేశారు. "రెండు కారం ముద్దలు తినండి... మరో రెండు కారం ముద్దలు ఒంటికి పూసుకుని పౌరుషం తెచ్చుకుని కేంద్రాన్ని నిలదీయండి అని పవన్ అన్నారు.
అప్పట్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఉంది. అయినప్పటికీ కూడా వైసీపీ ఎంపీలు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటాలు చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, విభజన హామీలు... మొదలైన వాటిపై డిమాండ్ చేస్తూనే వచ్చారు.
అయితే, ఇప్పుడు ఏపీకి చెందిన టీడీపీ, జనసేన పార్టీల ఎంపీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఊతకర్రల సాయంతో నడుస్తోంది. మరి, గతంలో చెప్పిన మాటలనే పవన్ కల్యాణ్ ఇప్పుడెందుకు చెప్పలేకపోతున్నాడు?" అంటూ రోజా ప్రశ్నించారు.