Budget 2025: బహుమతిగా అందుకున్న చీరను బడ్జెట్ వేళ ధరించిన నిర్మలా సీతారామన్.. ఎవరిచ్చారంటే?

- బడ్జెట్ సందర్భంగా కేంద్రమంత్రి ధరించిన చీరపై చర్చ
- చేనేత చీరలకే ప్రాధాన్యమిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల
- ఈసారి గోధుమవర్ణం చీర, ఎరుపు రంగు బ్లౌజ్, శాలువాతో మంత్రి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏటా బడ్జెట్ ప్రవేశ పెట్టే క్రమంలో కేంద్రమంత్రి ధరించిన చీరలపై ప్రత్యేకంగా చర్చ జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నిర్మలా సీతారామన్ చేనేత వస్త్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రతీ బడ్జెట్ కు ఆమె చేనేత చీరలోనే లోక్ సభకు వస్తున్నారు. ఈ రోజు కూడా చేనేత చీరను ధరించి బడ్జెట్ ప్రతులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. బంగారు అంచుతో ఉన్న గోధుమవర్ణం చీర, ఎరుపు రంగు బ్లౌజ్, శాలువాతో కనిపించారు. చీరపై ఉన్న చేపల ఆర్ట్ ఆకట్టుకుంది. ఈసారి కేంద్ర మంత్రి ధరించిన చీరకు మరో ప్రత్యేకత కూడా ఉంది. కేంద్ర మంత్రి నిర్మల బీహార్ లోని మధుబనికి వెళ్లినపుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీదేవి ఆమెను కలుసుకున్నారు. తాను డిజైన్ చేసిన చేనేత చీరను కేంద్ర మంత్రికి బహుకరించారు. బడ్జెట్ వేళ ఈ చీరను ధరించాలని కోరారు. పద్మశ్రీ దులారీదేవికి ఇచ్చిన మాట ప్రకారమే కేంద్ర మంత్రి ఈ చీరను ధరించారు.
ఏ బడ్జెట్ కు ఏ చీర ధరించారంటే..
- 2019లో మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు.
- 2020లో నీలం రంగు అంచులో పసుపుపచ్చ-బంగారు వర్ణంలో ఉన్న చీర కట్టులో మెరిశారు.
- 2021లో ఎరుపు-గోధుమరంగు కలగలిసిన భూదాన్ పోచంపల్లి చీరలో కనిపించారు.
- 2022లో మెరూన్ రంగు చీరను ధరించారు. ఇది కూడా ఒడిశాకు చెందిన చేనేత చీర.
- 2023లో బ్రౌన్ రంగులో టెంపుల్ బోర్డర్లో ఉన్న ప్రకాశవంతమైన ఎరుపు చీరతో కనిపించారు.
- 2024లో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ప్రతీకగా రామా బ్లూ రంగు చీర ధరించారు.