tech mahindra: టెక్ మహీంద్రకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

- సత్యం కంపెనీని చేజిక్కించుకున్న టెక్ మహీంద్ర
- సత్యం కంపెనీ వాస్తవ ఆదాయం ఆధారంగా పన్ను మదింపునకు సీబీడీటీ అనుమతించకపోవడాన్ని హైకోర్టులో సవాల్ చేసిన టెక్ మహీంద్ర
- సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు లేని ఆదాయాన్ని చూపారన్న టెక్ మహీంద్ర
- సత్యం కంపెనీ చూపిన ఊహజనిత ఆదాయం అధారంగా పన్ను చెల్లించడం సరికాదన్న ధర్మాసనం
తెలంగాణ హైకోర్టులో టెక్ మహీంద్రాకు భారీ ఊరట లభించింది. కుంభకోణంలో చిక్కుకున్న సత్యం కంప్యూటర్స్ను కొనుగోలు చేసిన టెక్ మహీంద్రా .. 2002 – 09 మధ్య సత్యం కంపెనీకి చెందిన వాస్తవ ఆదాయంపైనే ఆదాయపు పన్ను చెల్లించాలని న్యాయస్థానం తీర్పు వెలువరించింది.
సత్యం కుంభకోణం నేపథ్యంలో 2002 – 09 మధ్య వాస్తవ ఆదాయం ఆధారంగా పన్ను మదింపునకు సీబీడీటీ అనుమతించకపోవడాన్ని టెక్ మహీంద్రా హైకోర్టులో సవాల్ చేయగా, దీనిపై జస్టిస్ పి. శ్యాంకోశి, జస్టిస్ ఎన్. తుకారాంజీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
సత్యం మాజీ ఛైర్మన్ రామలింగరాజు లేని ఆదాయాన్ని చూపారని, దాని ఆధారంగా పన్ను చెల్లించాలనడం సరికాదని టెక్ మహీంద్రా వాదనలు వినిపించింది. ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. సత్యం కంపెనీ చూపిన ఊహాజనిత ఆదాయం ఆధారంగా పన్ను చెల్లించడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది.