Reliance Jio: యూజర్లకు జియో మరో బిగ్ షాక్.. ఆ రెండు డేటా ప్లాన్ల వ్యాలిడిటీ తగ్గింపు!

- రూ. 69, రూ. 139 డేటా ప్లాన్ల వ్యాలిడిటీని తగ్గించిన జియో
- గతంలో ఈ డేటా ప్లాన్ల గడువు బేస్ ప్లాన్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులూ
- ఇప్పుడు కేవలం ఏడు రోజులుగా ఫిక్స్ చేసిన టెలికాం సంస్థ
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ యూజర్లకు మరో బిగ్ షాక్ ఇచ్చింది. రెండు డేటా ప్లాన్ల వ్యాలిడిటీని తగ్గించింది. ఇటీవల రెండు పాప్యులర్ రీఛార్జి ప్లాన్లు రూ. 189, రూ. 479లను తొలగించిన జియో.. ఇప్పుడు రూ. 69, రూ. 139 డేటా ప్లాన్ల గడువును తగ్గించి, కేవలం ఏడు రోజులుగా ఫిక్స్ చేసింది.
గతంలో ఈ డేటా ప్లాన్ల గడువు బేస్ ప్లాన్ ఎన్ని రోజులు ఉంటే అప్పటివరకు ఉండేది. ఇకపై రూ. 69తో రీఛార్జ్ చేసుకుంటే 6జీబీ, రూ. 139తో చేస్తే వచ్చే 12 జీబీ డేటా వారం రోజులే వస్తుంది. ఈ మేరకు జియో తన అధికారిక వెబ్సైట్ ద్వారా శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
ట్రాయ్ ఆదేశాలతో జియో వాయిస్ ఓన్లీ ప్లాన్లు..
ట్రాయ్ ఆదేశాలను అనుసరించి జియో ఇటీవల వాయిస్ ఓన్లీ పేరిట రెండు రీఛార్జ్ ప్లాన్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రూ. 458, రూ. 1,958 ప్లాన్లను ప్రారంభించింది. రూ.458 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. దీనిలో దేశీయంగా ఉచిత అపరిమిత కాలింగ్తో పాటు 1,000 ఉచిత ఎస్సెమ్మెస్లను పొందవచ్చు.
అలాగే జియో సినిమా, జియో టీవీ యాప్లకు యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. ఇందులో మొబైల్ డేటా ఉండదు. అదేవిధంగా రూ.1,958 ప్లాన్ 365 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. దీనిలో ఉచిత అపరిమిత కాలింగ్, 3,600 ఎస్సెమ్మెస్లు లభిస్తాయి. ఇందులో కూడా మొబైల్ డేటా ఇవ్వలేదు.