Revanth Reddy: మేం రాగానే అధ్యాపకుల పదవీ విరమణ వయస్సు పెంచాం: రేవంత్ రెడ్డి

- మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం
- బడ్జెట్లో విద్యాశాఖకు రూ.21 వేల కోట్లు కేటాయించామని వెల్లడి
- అధికారంలోకి వచ్చిన 55 రోజుల్లోనే డీఎస్సీ నియామక ప్రక్రియను పూర్తి చేశామన్న సీఎం
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశ్వవిద్యాలయాల అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును పెంచామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, బడ్జెట్లో విద్యాశాఖకు రూ.21 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అంతేకాకుండా, మొగిలిగిద్ద పాఠశాల అభివృద్ధికి దాదాపు రూ. 16 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.
గతంలో నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీ, నియామక ప్రక్రియ సంవత్సరాల తరబడి కొనసాగేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేవలం 55 రోజుల్లోనే డీఎస్సీ నియామక ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. విశ్వవిద్యాలయాలను పునరావాస కేంద్రాలుగా మార్చారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపకులపతులను నియమించి, ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును పెంచామని పేర్కొన్నారు.
21 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. విద్యపై చేసే ఖర్చు, భవిష్యత్తుకు పెట్టుబడి అని ఆయన అన్నారు. విద్యాశాఖను తన ఆధీనంలోనే ఉంచుకొని నిత్యం సమీక్షిస్తున్నానని చెప్పారు. మొగిలిగిద్ద పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు.