Maha Kumbh Mela 2025: కుంభమేళాలో భక్తజనసందోహం.. నిన్నటికే 30 కోట్ల మంది పవిత్ర స్నానాలు

- ఈనెల 13న ప్రారంభమైన కుంభమేళా
- ప్రతిరోజూ భారీ సంఖ్యలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు
- ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్న కుంభమేళా
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా ఘనంగా కొనసాగుతోంది. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ప్రయాగ్రాజ్ భక్తజనసందోహంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ ఈ కుంభమేళాలో గురువారం నాటికే 30 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ అధికారులు తాజాగా వెల్లడించారు.
ఈ నెల 13న కుంభమేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. అప్పటినుంచి నిన్నటి వరకూ 30 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించినట్లు తెలిపారు. ఇక ఇవాళ ఉదయం 8 గంటల వరకూ 43 లక్షల మంది పవిత్ర స్నానాలు చేసినట్లు పేర్కొన్నారు.
కాగా, బుధవారం నాడు మౌని అమావాస్య సందర్భంగా ఒక్కరోజే సుమారు 7 కోట్ల మంది భక్తులు అమృత స్నానాలు చేయడం విశేషం. ఫిబ్రవరి 26 వరకు కుంభామేళా కొనసాగనుంది. దీంతో 45 రోజుల్లో సుమారు 40 కోట్ల మందికి పైగా పవిత్ర స్నానాలు ఆచరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కానీ, తాజా లెక్కలను బట్టి చూస్తుంటే.. ఈ సంఖ్య డబుల్ అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.