Kashyap Patel: కాబోయే ఎఫ్బీఐ చీఫ్ నోట 'జై శ్రీకృష్ణ'.. సెనేట్ విచారణలో తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించిన కశ్యప్ పటేల్!

- కశ్యప్ పటేల్ను ఎఫ్బీఐ చీఫ్ పోస్టుకు నామినేట్ చేసిన ట్రంప్
- ఈ నియామకం కోసం తాజాగా సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ముందు హాజరైన కశ్యప్
- ఈ సందర్భంగా తన తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించిన భారతీయ అమెరికన్
- తన ప్రసంగంలో జై శ్రీకృష్ణ అనడం ఆసక్తికరం.. నెట్టింట వీడియో వైరల్
- నియామకం పూర్తైతే ఎఫ్బీఐ డైరెక్టర్గా నియమితుడైన తొలి భారత సంతతి వ్యక్తిగా రికార్డు
అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ చీఫ్ నియామకం కోసం జరిగిన సెనేట్ విచారణకు భారత సంతతి వ్యక్తి కశ్యప్ పటేల్ తాజాగా సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడంతో పాటు తన ప్రసంగంలో 'జై శ్రీకృష్ణ' అనడం ఆసక్తికరంగా మారింది.
తల్లిదండ్రులవల్లే తాను ఇక్కడి వరకూ రాగలిగానని కశ్యప్ తెలిపారు. ఆయన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కశ్యప్ను ఎఫ్బీఐ చీఫ్ పోస్టుకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే.
"ఈ రోజు ఇక్కడ కూర్చున్న మా నాన్న, మా అమ్మ అంజనాను నేను స్వాగతించాలనుకుంటున్నాను. వారు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చారు. అలాగే మా సోదరి కూడా ఇక్కడే ఉంది. ఆమె కూడా ఈ రోజు ఇక్కడ నాతో ఉండటానికి సముద్రాలు దాటి వచ్చింది. నా ప్రపంచం మీరే. 'జై శ్రీ కృష్ణ' " అని కశ్యప్ పటేల్ అన్నారు.
ఎవరీ కశ్యప్ పటేల్..?
గుజరాతీ తల్లిదండ్రులకు 1980లో న్యూయార్క్లో జన్మించిన కశ్యప్ పటేల్ తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. లాంగ్ ఐలాండ్లోని గార్డెన్ సిటీ హైస్కూల్ నుండి పట్టభద్రుడయ్యారు. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొఫైల్ ప్రకారం పటేల్.. న్యూయార్క్కు తిరిగి రావడానికి ముందు రిచ్మండ్ విశ్వవిద్యాలయంలో తన అండర్ గ్రాడ్యుయేట్ చదువు పూర్తి చేశారు.
ఆ తర్వాత తన లా డిగ్రీ, ఇంటర్నేషనల్ లాలో సర్టిఫికేట్లను యునైటెడ్ కింగ్డమ్లోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఫ్యాకల్టీ ఆఫ్ లాస్ నుంచి సంపాదించారు.
మిస్టర్ పటేల్ హౌస్ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్ (హెచ్పీఎస్సీఐ)కి జాతీయ భద్రతా సలహాదారుగా, సీనియర్ న్యాయవాదిగా కూడా పనిచేశారు. ఇప్పుడు నియామకం పూర్తైతే ఎఫ్బీఐ డైరెక్టర్గా నియమితుడైన మొదటి హిందూ, తొలి భారత సంతతి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టిస్తారు.