KTR: హైదరాబాద్‌ను పట్టించుకోని ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా?: కేటీఆర్

KTR questions government over brs leaders arrest

  • హైదరాబాద్ నగరానికి నిధులివ్వడం లేదని ప్రశ్నిస్తే గెంటేస్తారా? అని నిలదీత
  • కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు కార్పొరేటర్ల గొంతు నొక్కుతారా? అని ఆగ్రహం
  • అరెస్టులతో అణగదొక్కాలని చూస్తే గుణపాఠం తప్పదని హెచ్చరిక

జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్‌పై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. పాలకమండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించినందుకు కార్పొరేటర్లను అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని, కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారా? అని నిలదీశారు.

గత సంవత్సరం కేటాయించిన బడ్జెట్ నిధులను కనీసం ఖర్చు చేయకుండా, మరోసారి అవే కాగితాలపై అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు తమ కార్పొరేటర్ల గొంతును నొక్కుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జీహెచ్ఎంసీ అసమర్థ తీరును ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందన్నారు.

హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటామన్నారు. అరెస్ట్ చేసిన కార్పొరేటర్లను, పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అరెస్టుల పేరుతో ప్రజాప్రతినిధులను అణగదొక్కాలని చూస్తే, ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

KTR
Telangana
BRS
GHMC
  • Loading...

More Telugu News