Virat Kohli: పుష్కర కాలం తర్వాత రంజీ ఆడుతున్న కోహ్లీ.. ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు

- ఆయుష్ బదోనీ సారథ్యంలో రంజీబరిలోకి కోహ్లీ
- విరాట్ రాకతో పెరిగిన ఢిల్లీ జట్టు బలం
- 10 వేలమంది ప్రేక్షకులు వస్తారని అంచనా
టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పుష్కరకాలం తర్వాత రంజీ బరిలో దిగాడు. రంజీట్రోఫీ ఎలైట్ గ్రూప్-డిలో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రైల్వేస్-ఢిల్లీ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. ఢిల్లీ జట్టుకు ఆయుష్ బదోనీ సారథ్యం వహిస్తున్నాడు. 12 ఏళ్ల తర్వాత తొలిసారి రంజీ ఆడుతున్న కోహ్లీపైనే అందరి దృష్టి ఉంది. అతడి రాకతో జట్టు బలం మరింత పెరిగింది.
కాగా, ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన రైల్వేస్ 17 పాయింట్లతో జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో కనుక గెలిస్తే బోనస్ పాయింట్లతో కలుపుకొని 24 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంటుంది. తమిళనాడు జట్టు ఆరు మ్యాచ్లు ఆడి మూడింటిలో గెలిచి 25 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఆరు మ్యాచ్లు ఆడి ఒకదాంట్లో విజయం సాధించి 14 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్తో కోహ్లీ ఎంట్రీ ఇవ్వడంతో గెలుపుపై ఆ జట్టు ధీమాగా ఉంది. కాగా, కోహ్లీ ఆడుతుండటంతో స్టేడియం 10 వేలమంది ప్రేక్షకులతో కళకళలాడే అవకాశం ఉందని భావిస్తున్నారు.