Haryana: కేజ్రీవాల్ సంచలన ఆరోపణ... యమునా నది నీటిని తాగిన హర్యానా ముఖ్యమంత్రి
![Haryana CM Nayab Saini takes sip from Yamuna amid poisoning claim](https://imgd.ap7am.com/thumbnail/cr-20250129tn679a395ee4e2d.jpg)
- బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా యమునా నదిని విషపూరితం చేస్తోందన్న కేజ్రీవాల్
- హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లోని పల్లా గ్రామంలో నీటిని తాగిన బీజేపీ సీఎం
- ఎలాంటి అనుమానాలు లేకుండా తాను నీటిని తాగానన్న నాయబ్ సింగ్ సైనీ
హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ యమునా నది నీటిని తాగారు. యమునా జలాలను హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విషపూరితం చేస్తోందని అరవింద్ కేజ్రీవాల్, ఇతర ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ చర్యకు ఉపక్రమించారు.
ఈరోజు హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లోని పల్లా గ్రామంలో యమునా నది వద్ద ఆయన నదీ ప్రవాహంలోని నీటిని దోసిలిలోకి తీసుకుని తాగారు. ఆ తర్వాత ఆ నీటిని తన తలపై కూడా చల్లుకున్నారు. అనంతరం హర్యానా సీఎం మాట్లాడుతూ, ఎలాంటి సందేహాలు లేకుండా తాను ఈ నీటిని తాగానన్నారు. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిశీ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అబద్ధాలు ప్రజల్లో పనిచేయడం లేదన్నారు.