Jani Master: ఆరోజు మీ నిజస్వరూపమేంటో అందరికీ తెలుస్తుంది... అది ఎంతో దూరంలో లేదు: జానీ మాస్టర్

- 'ఎక్స్' వేదికగా జానీ మాస్టర్ ఆసక్తికర పోస్టు
- తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలి వేస్తుందన్న కొరియోగ్రాఫర్
- నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని వ్యాఖ్య
టాలీవుడ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తాజాగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా చేసిన ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. తమ సొంత ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలి వేస్తుందని అందులో ఆయన పేర్కొన్నారు. నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని, అది ఎంతో దూరంలో లేదని జానీ మాస్టర్ ట్వీట్ చేశారు. అయితే, ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ పోస్టు పెట్టారనేది మాత్రం క్లీయర్గా లేదు.
"తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. నాకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి... మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతున్నారు.
మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ, అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారనేది అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది" అని జానీ మాస్టర్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.