Virat Kohli: రంజీ ట్రోఫీ కోసం కోహ్లీ ప్రాక్టీస్.. సైనీ బౌలింగ్లో ఇబ్బంది పడిన ఇండియన్ స్టార్

- ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో ఇబ్బంది పడిన కోహ్లీ
- రంజీల్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించనున్న టీమిండియా స్టార్
- నెట్స్లో చెమటోడుస్తున్న విరాట్
2012 తర్వాత తొలిసారి రంజీ ట్రోఫీలో ఆడనున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి భారత బౌలర్లు చుక్కలు చూపించారు. రంజీ ట్రోఫీ కోసం నెట్స్లో చెమటోడుస్తున్న కోహ్లీ.. టీమిండియాలో స్థానం కోల్పోయిన నవదీప్ సైనీ, సిద్ధాంత్ శర్మ బౌలింగ్లో ఆడేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. ఢిల్లీలోని ఫిరోజ్షా కోట్లా స్టేడియం నెట్స్లో ఐదుగురు బౌలర్లు మనీ గ్రెవాల్, నవదీప్ సైనీ, రాహుల్ గెహ్లాట్, సిద్ధాంత్ శర్మ, వివేక్ గుల్షన్ను కోహ్లీ ఎదుర్కొన్నాడు. మొత్తం 25 నిమిషాలపాటు వారి బౌలింగ్లో ఆడిన కోహ్లీ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు.
నెట్స్లో ఆత్మవిశ్వాసంతో కనిపించిన విరాట్.. సైనీ, శర్మ బౌలింగ్లో తొలుత ఇబ్బంది పడినప్పటికీ ఆ తర్వాత కొన్ని షాట్లు కూడా కొట్టాడు. అంతకుముందు అరగంటపాటు ముగ్గురు స్నిన్నర్లు హర్ష్ త్యాగి (లెఫ్టార్మ్), సుమిత్ మాథుర్ (లెఫ్టార్మ్), శివం (రైటార్మ్)లను కోహ్లీ ఎదుర్కొన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. కాగా, రంజీల్లో కోహ్లీ ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించనున్నాడు.