ISRO: ఇస్రో వందో ప్రయోగం విజయవంతం.. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎస్15
- నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్-02ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ
- సరిగ్గా 19 నిమిషాల తర్వాత కక్ష్యలో ప్రవేశపెట్టిన వైనం
- వంద ప్రయోగాలతో సరికొత్త మైలురాయిని చేరుకున్న ఇస్రో
- ఇప్పటి వరకు 548 శాటిలైట్ల ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో బుధవారం ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. రెండోతరం నావిగేషన్ శాటిలైట్ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇస్రోకు ఇది వందో ప్రయోగం. శ్రీహరికోటలోని సతీశ్ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో లాంచ్ప్యాడ్ నుంచి ఈ తెల్లవారుజామున 6.23 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన జియోసింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్-ఎఫ్ 15 (జీఎస్ఎల్వీ-ఎఫ్ 15).. తాను మోసుకెళ్లిన ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని సరిగ్గా 19 నిమిషాల తర్వాత 322.93 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది.
ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ మాట్లాడుతూ.. ఇస్రో ఇప్పటి వరకు 100 ప్రయోగాల్లో ఆరు జనరేషన్లకు చెందిన 548 శాటిలైట్లను ప్రయోగించినట్టు తెలిపారు. వీటి మొత్తం బరువు 120 టన్నులని పేర్కొన్నారు. వీటిలో 433 విదేశీ ఉపగ్రహాలు ఉన్నట్టు వివరించారు. ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల్లో మూడు చంద్రయాన్ మిషన్లు, మార్స్ ఆర్బిటర్ మిషన్, ఆదిత్య ఎల్1, ఒకే ప్రయోగంలో 104 శాటిలైట్లు, నావిగేషన్, భూ పర్యవేక్షణ ఉపగ్రహాలు ఉన్నట్టు తెలిపారు.
కాగా, తాజాగా కక్ష్యలో ప్రవేశపెట్టిన ఎస్వీఎస్-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2,250 కిలోలు. ఇస్రో చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వి.నారాయణన్కు ఇది మొదటి ప్రయోగం. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ తదితర సేవలను ఈ ఉపగ్రహం అందిస్తుంది.