Revanth Reddy: పెట్టుబడులపై కొంతమంది దుష్ప్రచారం చేశారు: దావోస్ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి

- దావోస్ పర్యటన ద్వారా భారీ ఒప్పందాలు కుదిరాయన్న సీఎం
- ప్రభుత్వంపై నమ్మకం ఉంచి భారీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయన్న సీఎం
- దావోస్ ద్వారా రూ.1.80 లక్షల పెట్టుబడులు వచ్చాయన్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్లో పెట్టుబడులు, వ్యాపారాలపై కొంతమంది దుష్ప్రచారం చేశారని, కానీ దావోస్ పర్యటన ద్వారా భారీ ఒప్పందాలు రావడంతో వారి ప్రచారం పటాపంచలైందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ... ఈ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి అంతర్జాతీయ సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు.
అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్కు తీసుకువచ్చేందుకు దావోస్ వెళ్లామన్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భారీగా పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్నామన్నారు. దావోస్ ద్వారా దాదాపు రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను తెలంగాణకు ఆకర్షించామన్నారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.