Raghu Rama Krishna Raju: తులసిబాబుకు టీడీపీకి సంబంధం లేదన్న పల్లా ప్రకటన సంతోషం కలిగించింది: రఘురామ

Raghurama welcomes Palla statement over Tulasibabu

  • గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనుచరుడిగా తులసిబాబు కార్యకలాపాలు
  • క్లారిటీ ఇచ్చిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
  • తులసిబాబుకు టీడీపీకి సంబంధం లేదని స్పష్టీకరణ
  • పల్లా ప్రకటనను స్వాగతిస్తున్నామన్న రఘురామ
  • గుడివాడ ప్రజలకు దీపావళి వచ్చిందని వెల్లడి

ఏపీ డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అనుచరుడిగా సమాంతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ఆరోపణలు రావడం తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. 

కామేపల్లి తులసిబాబుకు టీడీపీతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీలో తులసిబాబుకు ఎలాంటి పదవులు లేవని అన్నారు. పల్లా వివరణ నేపథ్యంలో, రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడారు. 

పల్లా శ్రీనివాసరావు ప్రకటనను స్వాగతిస్తున్నానని తెలిపారు. ఇక నుంచి గుడివాడలో జై తులసిబాబు అనే నినాదాలు, బ్యానర్లు ఉండవు, ఉండకూడదు అని అన్నారు. పల్లా ప్రకటనతో గుడివాడ ప్రజలు నిజమైన దీపావళి వచ్చినట్టు భావిస్తున్నారని రఘురామ వ్యాఖ్యానించారు. పల్లా ప్రకటన వెలువడిన గంటలోనే నాకు గుడివాడ నుంచి పెద్ద సంఖ్యలో ఫోన్లు వచ్చాయి అని వెల్లడించారు. 

తులసిబాబుకు టీడీపీతో సంబంధం లేదన్న విషయం తెలియడంతో ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ విషయంలో పార్టీ త్వరితగతిన స్పందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని రఘురామ పేర్కొన్నారు.

Raghu Rama Krishna Raju
Tulasibabu
Palla Srinivasa Rao
TDP
Gudivada
  • Loading...

More Telugu News