Gongadi Trisha: అండర్-19 మహిళల వరల్డ్ కప్: తెలుగుమ్మాయి త్రిష వరల్డ్ రికార్డ్

- మలేసియాలో అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్
- నేడు టీమిండియా-స్కాట్లాండ్ మ్యాచ్
- 20 ఓవర్లలో 1 వికెట్ కు 208 పరుగులు చేసిన టీమిండియా
- 59 బంతుల్లో 110 పరుగులు చేసిన త్రిష
- అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో తొలి సెంచరీ సాధించిన బ్యాటర్ గా రికార్డ్
మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా జోరు కొనసాగుతోంది. స్కాట్లాండ్ తో మ్యాచ్ లో టీమిండియా 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష మెరుపు సెంచరీతో వరల్డ్ రికార్డు సృష్టించింది. త్రిష టీ20 అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలోనే తొలి సెంచరీ సాధించిన బ్యాటర్ గా నిలిచింది.
తెలంగాణలోని భద్రాచలంకు చెందిన త్రిష నేటి మ్యాచ్ లో 53 బంతుల్లో సెంచరీ సాధించింది. త్రిష మొత్తం 59 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 4 సిక్సులతో అజేయంగా 110 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో త్రిష ఓపెనర్ గా బరిలో దిగింది.
మరో ఓపెనర్ కమలిని 42 బంతుల్లో 9 ఫోర్లతో 51 పరుగులు చేసింది. ఈ టోర్నీలో టీమిండియా అమ్మాయిలు ఇప్పటికే సెమీస్ చేరుకున్నారు. ఇవాళ స్కాట్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ సూపర్ సిక్స్ దశలో చివరిది.
209 పరుగుల లక్ష్యఛేదనలో స్కాట్లాండ్ విలవిల్లాడుతోంది. 10 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు చేజార్చుకుని 43 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3, వైష్ణవి శర్మ 3 వికెట్లు తీశారు.