Kho Kho: ప్రపంచకప్ గెలిస్తే రూ.5 లక్షల నజరానానా?.. సీఎం బహుమతిని తిరస్కరించిన ఖోఖో ఆటగాళ్లు

- ఆటగాళ్లను ఘనంగా సత్కరించిన కర్ణాటక ముఖ్యమంత్రి
- సీఎంను అవమానించలేదన్న ఆటగాళ్లు
- పక్క రాష్ట్రంలో రూ. 2.25 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారని వెల్లడి
ప్రపంచకప్ గెలిచి దేశ ప్రతిష్ఠను పెంచిన తమకు తగిన గుర్తింపు దక్కలేదని కర్ణాటక ఖోఖో ఆటగాళ్లు ఇద్దరు వాపోయారు. కప్ గెలిచి చరిత్ర సృష్టించిన ఆటగాళ్లకు పక్క రాష్ట్రం భారీ రివార్డుతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఆఫర్ చేసిందని గుర్తుచేశారు. తమకు మాత్రం ప్రభుత్వం రూ.5 లక్షల నజరానాతో సరిపెట్టిందని వాపోయారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించిన బహుమతిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ముఖ్యమంత్రిని అవమానించడం కాదని, తమ గౌరవాన్ని కాపాడుకోవడమేనని అన్నారు. ఈమేరకు ఇటీవల ఖోఖో ప్రపంచకప్ గెలుచిన పురుషులు, మహిళల జట్టులోని కర్ణాటక ఆటగాళ్లు ఎం కె గౌతమ్, చైత్ర బి పేర్కొన్నారు.
ప్రభుత్వ బహుమతి ప్రకటనపై గౌతమ్ మాట్లాడుతూ.. తమ విజయాన్ని మరింత గౌరవంగా అంగీకరించాలని అన్నారు. మహారాష్ట్ర ఆటగాళ్లకు అక్కడి ప్రభుత్వం రూ. 2.25 కోట్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించిందని చెప్పారు. కర్ణాటకలో మాత్రం ఆ స్థాయి గౌరవం దక్కడం లేదని వాపోయారు. ఈ విషయంపై మరోసారి సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహిళల జట్టు సభ్యురాలు చైత్ర స్పందిస్తూ.. తాము కూడా ప్రపంచ కప్ గెలిచిన ఆటగాళ్లమే అయినా ఇతర క్రీడా జట్లకు లభించే గౌరవం దక్కడంలేదని వాపోయారు. రూ. 5 లక్షల బహుమతితో క్రీడను కొనసాగించడం ఎలా? అని ఆమె ప్రశ్నించారు.