Man Eater: మహిళపై దాడిచేసి చంపిన పులి.. 'మ్యాన్ ఈటర్'ను చంపాలని ప్రభుత్వం ఆదేశం

- వయనాడ్లోని మనంతవాడిలో మహిళను చంపిన పులి
- ఆమె శరీరంలోని కొంత భాగాన్ని తినేసిన వైనం
- ఆ పులిని మ్యాన్ ఈటర్గా ప్రకటించిన కేరళ
మహిళపై దాడిచేసి చంపిన పులిని ‘మ్యాన్ ఈటర్’గా ప్రకటించిన కేరళ ప్రభుత్వం దానిని హతమార్చాలని ఆదేశాలు జారీచేసింది. వయనాడ్లోని మనంతవాడి సమీపంలో కాఫీ తోటలో పనిచేస్తున్న 45 ఏళ్ల రాధపై ఇటీవల దాడిచేసిన పెద్దపులి ఆమెను చంపేసింది. ఆపై ఆమె శరీరంలోని కొంత భాగాన్ని తినేసింది. ఆ తర్వాత అటవీశాఖ అధికారి జయసూర్యపైనా దాడిచేసింది.
పులి వరుస దాడులతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అది ఎప్పుడు ఎవరిపై దాడిచేస్తుందోనని భయంతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి శశీంద్రన్ పులిని మ్యాన్ ఈటర్గా ప్రకటిస్తూ దానిని చంపేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. రాష్ట్రంలో ఓ పులిని మ్యాన్ ఈటర్గా ప్రకటించడం ఇదే తొలిసారని మంత్రి తెలిపారు.