Pawan Kalyan: పద్మ అవార్డు గ్రహీతలకు పవన్ కల్యాణ్ అభినందనలు

- నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషదాయకమన్న పవన్ కల్యాణ్
- పద్మ విభూషణ్కు ఎంపికైన ప్రముఖ వైద్యులు డా.డి.నాగేశ్వర్ రెడ్డికి అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్
- మట్టిలో మాణిక్యాలాంటి వారికి ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు అందిస్తోందన్న పవన్ కల్యాణ్
తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు పద్మ అవార్డులకు ఎంపిక కావడం పట్ల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, అవార్డులకు ఎంపికైన వారికి అభినందనలు తెలియజేశారు. అయిదు దశాబ్దాల పైబడి తెలుగు చలనచిత్ర సీమలో తన అభినయంతో ప్రేక్షకుల మెప్పు పొందిన నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. వెండి తెరపై విభిన్న పాత్రలు పోషించిన బాలకృష్ణ హిందూపురం శాసన సభ సభ్యుడిగా, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ గా ఎన్నో సేవలందిస్తున్నారని అన్నారు. ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు. ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో పలు పరిశోధనలు చేసిన డా.డి. నాగేశ్వర్ రెడ్డి పద్మవిభూషణ్కు ఎంపికైనందుకు అభినందనలు తెలియజేశారు.
ప్రజా ఉద్యమాల్లో మంద కృష్ణ మాదిగకు ప్రత్యేక స్థానం ఉందని, ఎం.ఆర్.పి.ఎస్. ద్వారా మాదిగలకు రిజర్వేషన్ కోసం పోరాడారన్నారు. అనారోగ్యంతో బాధపడే పిల్లలకు ప్రభుత్వ వైద్య సహాయం కోసం, వికలాంగుల కోసం ప్రజా పోరాటాలు చేశారని గుర్తు చేశారు. మంద కృష్ణ మాదిగ పద్మశ్రీ కు ఎంపికైనందుకు అభినందనలు తెలియజేశారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సహస్రావధాని, కవి మాడుగుల నాగఫణి శర్మ, సాహిత్యం-విద్య విభాగంలో ఎంపికైన కెఎల్ కృష్ణ, వి రాఘవేంద్రాచార్య పంచముఖిలకు అభినందనలు తెలియజేశారు.
మట్టిలో మాణిక్యాలలాంటి వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు అందిస్తోందన్నారు. ఈ ఏడాది 30 మంది ఈ విధంగా ఎంపికైన వారు ఉండటం సంతోషాన్ని కలిగించిందన్నారు. మన రాష్ట్రానికి చెందిన బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావు మరణానంతరం పద్మశ్రీకి ఎంపికయ్యారని, వారి కళా సేవకు తగిన గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు.