Nara Lokesh: ఏఐ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రీ స్కిల్లింగ్ అవసరం: దావోస్ లో నారా లోకేశ్

- దావోస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఏపీ మంత్రి నారా లోకేశ్
- ఏఐపై ఆసక్తికరంగా ప్రసంగం
- ఏపీలో ఏఐ యూనివర్సిటీ స్థాపించబోతున్నామని వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా ఏఐ ట్రాన్స్ ఫార్మేషన్ కారణంగా డేటా సైంటిస్టులు, ఏఐ ట్రైనర్లు, ఎథికల్ ఏఐ స్పెషలిస్టులకు డిమాండ్ ఏర్పడుతుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. గ్లోబల్ ఎకానమీస్ & లేబర్ మార్కెట్లపై ఏఐ పరివర్తన ప్రభావం (The Transformative Impact of AI on Global Economies & Labour Markets) అనే అంశంపై దావోస్ ఆల్పెన్ గోల్డ్ హోటల్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి లోకేశ్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి వరల్డ్ ఎకనమిక్ ఫోరం వైట్ షీల్డ్ ఆర్థిక విభాగం మాజీ చీఫ్ జెన్నీఫర్ బ్లాంకే, గూగుల్ డైరక్టర్ (గవర్నమెంట్ ఎఫైర్స్) సెలిమ్ ఎడే సంధానకర్తలు వ్యవహరించారు. సమావేశంలో మంత్రి నారా లోకేశ్ ఏఐ గురించి ఆసక్తికరంగా ప్రసంగించారు.
"మ్యానుఫ్యాక్చరింగ్, కస్టమర్ సర్వీస్, డేటా ప్రాసెసింగ్ వంటి రంగాల్లో 25 నుంచి 30 శాతం వరకు టాస్కులు ఆటోమేషన్ అవుతాయి. దీని ప్రభావం ఆయా రంగాల్లో పనిచేసే ఉద్యోగులపై ఉంటుంది. ఏఐ ట్రాన్స్ ఫార్మేషన్ నేపథ్యంలో రీ స్కిల్లింగ్ అవసరం. ఇందుకోసం ప్రభుత్వాలు, కార్పొరేట్లు కలసి పనిచేయాల్సి ఉంటుంది.
భారత్ లో ఏఐ సంబంధిత వనరులకు జాతీయ ఏఐ పోర్టల్ రిపోజిటరీగా పనిచేస్తోంది. వ్యక్తులు, సంస్థలు ఏఐలో అవకాశాలను అన్వేషించడానికి ఈ పోర్టల్ సహాయపడుతుంది. డిజిటల్ ఇండియా మిషన్ ద్వారా నిర్వహిస్తున్న అక్షరాస్యత కార్యక్రమాలు భవిష్యత్ ఏఐ శిక్షణకు పునాదిగా నిలుస్తాయి. ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ వంటి జాతీయ-స్థాయి కార్యక్రమాలు, NASSCOM, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ సంయుక్త ప్రయత్నాలు ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్లో నైపుణ్యం పెంపొందించడానికి దోహదపడతాయి.
ఏపీలో ఏఐ విద్య అభివృద్ధికి గూగుల్ తో సహా ప్రముఖ సంస్థలతో కలసి పనిచేస్తాం. రాష్ట్రంలో తొలి ఏఐ స్కిల్స్ ల్యాబ్ని విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో ఏర్పాటు చేశారు. చీపురుపల్లిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు 500 మంది విద్యార్థులు ఇందులో శిక్షణ పొందుతున్నారు. ‘ఏఐ ఫర్ ఆల్’ కార్యక్రమం కింద ఉపాధ్యాయులు కూడా శిక్షణ తీసుకున్నారు. భవిష్యత్ తరం ఏఐ నిపుణులు, పరిశోధకులు, అభ్యాసకులకు శిక్షణనిచ్చేందుకు ఏఐ విశ్వవిద్యాలయాన్ని స్థాపించబోతున్నాం" అని మంత్రి లోకేశ్ వివరించారు.