Karnataka: కర్ణాటకలో కూరగాయల లారీ బోల్తా పడి 10 మంది రైతుల మృతి

- బుధవారం తెల్లవారుజామున ఎల్లాపూర్ తాలూకాలో దారుణం
- మరో పదిహేను మంది రైతులకు తీవ్ర గాయాలు
- మార్కెట్ కు కూరగాయలు తరలిస్తుండగా ప్రమాదం
కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున కూరగాయల లారీ బోల్తా పడింది. దీంతో పదిమంది రైతులు అక్కడికక్కడే చనిపోయారు. మరో పదిహేను మందికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సావనూర్ కు చెందిన రైతులు తాము పండించిన కూరగాయలను కుంత మార్కెట్ లో అమ్మేందుకు లారీలో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న లారీ ఎల్లాపూర్ తాలూకాలో అరేబైల్- గుల్లాపురా మధ్య హైవేపై అదుపుతప్పింది.
మరో వాహనానికి దారి ఇచ్చే క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న 50 మీటర్ల లోయలో పడిపోయింది. దీంతో లారీలో కూర్చున్న రైతులు పదిమంది చనిపోగా మరో పదిహేను మంది గాయపడ్డారు. వాహనదారుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.