Crime News: భర్తతో గొడవపడి తమిళనాడు నుంచి బెంగళూరు వచ్చిన మహిళపై సామూహిక లైంగికదాడి

- బస్టాండ్లో బస్సు కోసం వేచి చూస్తుండగా ఘటన
- నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
- బాధితురాలిని షెల్టర్ హోంకు తరలించిన పోలీసులు
బస్సు కోసం బస్టాండ్లో వేచి చూస్తున్న మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడి, ఆపై ఆమెను దోచుకున్న కేసులో ఇద్దరు నిందితులను బెంగళూరు పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. వారి కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన 37 ఏళ్ల మహిళ ఐదు రోజుల క్రితం భర్తతో గొడవ పడి నగరానికి చేరుకుంది. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో బస్టాండ్లో బస్సు కోసం వేచి చూస్తోంది.
ఈ క్రమంలో అక్కడే ఉన్న నిందితులను యలహంక వెళ్లే బస్సు ఎప్పుడొస్తుందని విచారించింది. అందుకు వారు ఆ బస్సు ఇక్కడ ఆగదని, మరో బస్టాప్ దగ్గర ఆగుతుందని చెప్పి సాయం చేస్తున్నట్టు నటిస్తూ ఆమెను గోడౌన్ స్ట్రీట్కు తీసుకెళ్లారు. అక్కడ నిందితులు ఇద్దరూ కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమె మొబైల్ ఫోన్, డబ్బులు, నగలు దోచుకుని పరారయ్యారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని షెల్టర్ హోంకు తరలించారు. ఈ ఘటన రాజకీయంగానూ దుమారం రేపింది. ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విమర్శలను తిప్పికొట్టారు. బీజేపీ హయాంలో ఇలాంటి ఘటన ఒక్కటి కూడా జరగలేదా? అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనపై ఉక్కుపాదం మోపుతామని, మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పారు.