Chandrababu: దావోస్ లో కళకళలాడిన ఏపీ పెవిలియన్... హేమాహేమీలతో చంద్రబాబు సమావేశాలు

AP CM Chandrababu met top CEOs and Chairmans in Davos

  • దావోస్ లో రెండో రోజు పర్యటన
  • అంతర్జాతీయ వ్యాపార దిగ్గజాలతో చంద్రబాబు భేటీ
  • ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు. ఇవాళ డబ్ల్యూఈఎఫ్ లోని ఏపీ పెవిలియన్ కళకళలాడింది. ప్రపంచ దిగ్గజ సంస్థల సీఈవోలు, చైర్మన్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. నిన్న తొలిరోజున ఆర్సెలర్ మిట్టల్ గ్రూపు చంద్రబాబును కలవడం తెలిసిందే. 

ఇవాళ చంద్రబాబుతో సమావేశమైన వారిలో ఎల్జీ కెమ్ లిమిటెడ్ సీఈవో షిన్ హాక్ చియోల్, అంతర్జాతీయ లాజిస్టిక్స్ కంపెనీ మేస్క్ (Maersk) సీఈవో విన్సెంట్ క్లెర్క్, టెక్ కంపెనీ సిస్కో సీఈవో/చైర్మన్ చక్ రాబిన్స్ వంటి హేమాహేమీలు ఉన్నారు. ఏపీలో ఉన్న అవకాశాలు, పెట్టుబడులకు అనుమతుల విధానం, ఏపీ ప్రభుత్వ లక్ష్యాలను వారికి చంద్రబాబు వివరించారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్కరించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా వారిని ఆహ్వానించారు.

మేస్క్ (Maersk) సీఈవోతో కీలక సమావేశం

వెయ్యి కిలోమీటర్ల పైనే తీరప్రాంతం కలిగి వుండటం, విస్తారంగా పోర్టులు ఉండటం... ఆంధ్రప్రదేశ్ బలమని, మానవ వనరులకు లోటు లేదని...  మేస్క్ (Maersk) సీఈవో విన్సెంట్ క్లర్క్‌కు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలలో ఒకటైన డెన్మార్క్‌కు చెందిన మేస్క్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. 130 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, ప్రపంచ రవాణా రంగంలో రారాజులా వున్న మేస్క్  రాష్ట్రానికి వస్తే సముద్రరవాణాలో ఏపీ దేశంలోనే అగ్రగామి రాష్ట్రం అవుతుంది. 

ప్రపంచ వ్యాప్తంగా భారీ ఉత్పత్తులు, వాణిజ్య వస్తువులు సముద్ర మార్గం ద్వారా రవాణా చేయడంలో మేస్క్ కు తిరుగులేదు. మేస్క్ ఏపీకి వస్తే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. రాష్ట్రంలోని ఓడరేవులు, ప్రధానంగా విశాఖపట్నం పోర్టు మరింత అభివృద్ధి చెందుతాయి. 

ఆసియా పసిఫిక్ మార్కెట్లకు రవాణా హబ్‌గా ఏపీ మారే అవకాశం ఉంటుంది. అటు ఎగుమతులు, దిగుమతుల రంగం బలపడుతుంది. ఏపీ ఒక గ్లోబల్ లాజిస్టిక్ హబ్‌గా ఎదగడమే కాకుండా, భారతదేశ ఆర్థిక వృద్ధిలో ప్రధాన పాత్ర పోషించేందుకు దోహదపడుతుంది.

పెట్టుబడుల కోసం ‘సిస్కో’కు ఆహ్వానం 

ఈథర్‌నెట్, ఆప్టికల్, వైర్‌లెస్, మొబిలిటీ వంటి నెట్‌వర్కింగ్‌లో సాంకేతికతలను అందించడం, డేటా సెంటర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో పేరున్న మల్టీ-నేషనల్ టెక్నాలజీ సంస్థ సిస్కో చైర్మన్, సీఈవో చుక్ రాబిన్స్‌తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర చర్చలు జరిపారు. టెక్నాలజీ ఇన్నోవేషన్‌లో గ్లోబల్ లీడర్‌గా వున్న సిస్కో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామి కావాలని చుక్ రాబిన్స్ దగ్గర ముఖ్యమంత్రి తన ఆకాంక్ష వ్యక్తం చేశారు. విశాఖపట్నం లేదా తిరుపతిలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటుకు యోచన చేయమని... రాష్ట్రంలో ప్రతిభకు లోటు లేదని చెప్పారు. APలో నెట్‌వర్క్ భాగాల తయారీకి ఆహ్వానించారు. 
  
లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు చేయండి

ఎల్జీ కెమ్ లిమిటెడ్ సీఈవో షిన్ హక్ చియోల్‌కు రాష్ట్రంలో వివిధరంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. ఎల్జీ కెమ్ దక్షిణ కొరియాలో అతిపెద్ద కెమికల్ కంపెనీ, 1.5 బిలియన్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు యోచనలో వున్న ఎల్జీ కెమ్‌ అనుబంధ సంస్థ ఎనర్జీని రాష్ట్రంలో నెలకొల్పాల్సిందిగా ముఖ్యమంత్రి ఈ భేటీలో కోరారు. 

పెట్రో కెమికల్ రంగంలో యూనిట్లు మూలపేట - విశాఖలోనూ, సెమీకండక్టర్ యూనిట్ తిరుపతిలోనూ నెలకొల్పేందుకు వున్న అవకాశాలను పరిశీలించమని సూచించారు. రాష్ట్రంలో తయారీకి అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు వేగంగా ప్లాంట్ ఏర్పాటయ్యేలా పూర్తి మద్దతిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్, దక్షిణ కొరియా మధ్య పెట్టుబడుల కోసం ఎల్జీ కెమ్ సీఈవోను అంబాసిడర్‌గా ఉండాలని అభ్యర్ధించారు.

కార్ల్స్‌బెర్గ్ గ్రూప్ సీఈవోతో చర్చలు

పళ్ల రసాలు, శీతల పానీయాలు, బీర్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌ ఉత్పత్తి చేసే కార్ల్స్ బెర్గ్ గ్రూప్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్‌తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ, బాట్లింగ్ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయమని కోరారు. ఇందుకోసం విశాఖపట్నం, కృష్ణపట్నం, శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించమని చెప్పారు. బార్లీ, మొక్కజొన్న, వరి వంటి అధిక నాణ్యమైన ఆహార ఉత్పత్తులను సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని రైతులతో భాగస్వామి కావాల్సిందిగా కోరారు. 

  • Loading...

More Telugu News