Eatala Rajendar: ఎంపీ ఈటలపై ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకుల ఆగ్రహం

- మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ఘటన
- రియల్ ఎస్టేట్ కు చెందిన వ్యక్తిపై చేయిచేసుకున్న ఈటల
- ఈటల వాస్తవాలు తెలుసుకోవాలన్న వెంచర్ నిర్వాహకులు
- భూ యజమానులమైన తమను బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం
మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ఓ వ్యక్తిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ చేయిచేసుకోవడం తెలిసిందే. ఇళ్ల స్థలాల సొంతదారులను ఇబ్బంది పెడతావా అంటూ ఈటల ఆ వ్యక్తి చెంప చెళ్లుమనిపించారు. అయితే, ఎంపీ తీరును ఏకశిలానగర్ వెంచర్ నిర్వాహకులు తప్పుబట్టారు. ఎంపీ దురుసుగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు.
ఏకశిలానగర్ భూములకు తాము యజమానులమని, తమ వద్ద వెంచర్ కు సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని వారు స్పష్టం చేశారు. అన్ని కోర్టుల్లోనూ తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని వెల్లడించారు. భూ యజమానులమైన తమను బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ ఈటల రాజేందర్ వాస్తవాలు తెలుసుకుంటే బాగుంటుందని వెంచర్ నిర్వాహకులు హితవు పలికారు.