Chandrababu: మీ అందర్నీ చూస్తుంటే నాలో నమ్మకం పెరిగింది... భవిష్యత్లో నా కలలు నిజమవుతాయనిపిస్తోంది: సీఎం చంద్రబాబు

- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్లో పర్యటిస్తున్న చంద్రబాబు
- సీఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్పై నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సీఎం
- భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి
- ప్రపంచ దేశాలకు మనవాళ్లు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని ప్రశంస
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్పై నిర్వహించిన సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయన్న ఆయన... ప్రపంచ దేశాలకు మనవాళ్లు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.
ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ... "మీ అందర్నీ చూస్తుంటే నాలో నమ్మకం పెరిగింది. భవిష్యత్లో నా కలలు నిజమవుతాయనే నమ్మకం కలిగింది. 1991లో దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఇంటర్నెట్, ఆర్థిక సంస్కరణలను వినియోగించి రెండో తరం సంస్కరణలను ప్రవేశపెట్టాను.
ఎక్కడికి వెళ్లినా ఏపీ పారిశ్రామికవేత్తలే కనిపిస్తున్నారు. భారతీయులు అందిస్తున్న సేవలపట్ల గర్వంగా ఉంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో రాజకీయ అనిశ్చితి ఉంది. కానీ, ఇండియాలో మాత్రం ప్రధాని మోదీ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉంది.
ఇక రెండున్నర దశాబ్దాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. అన్ని రంగాలలో అభివృద్ధి చేశాం. భారత్లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశాం" అని సీఎం చంద్రబాబు అన్నారు.