KTR: కేసీఆర్ మాట్లాడే సమయంలో ఆంధ్రాలో కూడా ఎంతోమంది ఆసక్తిగా వినేవారు!: కేటీఆర్

- కేసీఆర్ మాట వింటే ధైర్యం వస్తుందనుకునే వారు ఉన్నారన్న కేటీఆర్
- కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తుందన్న కేటీఆర్
- కేసీఆర్ కార్మికుల కోసం ఎంతో చేశాడన్న మాజీ మంత్రి
కేసీఆర్ మాట్లాడే సమయంలో ఆంధ్రాలో కూడా ఎంతోమంది ఆసక్తిగా వినేవారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ మాట వింటే ధైర్యం వస్తుందనుకునే వారు చాలామంది ఉన్నారన్నారు. కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తుందన్నారు. కేసీఆర్ కార్మికుల కోసం ఎంతో చేశాడని... ఈ విషయాలు అందరికీ తెలుసున్నారు.
2014 జూన్ 2న కేసీఆర్ అధికారంలోకి వస్తే... అదే నెల 21న హమాలీలను పిలిచి వారి సమస్యలపై మాట్లాడారన్నారు. కార్మికుల గురించి పట్టించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఎవరూ లేరన్నారు. కష్టం వచ్చినప్పుడే నాయకుడి విలువ తెలుస్తుందన్నారు. క్రికెట్ మ్యాచ్ కోసం కూర్చున్నట్లు కేసీఆర్ కరోనా సమయంలో ప్రెస్ మీట్ కోసం కూర్చునే వారని వెల్లడించారు. కరోనా సమయంలో ఇటుక బట్టీలు, హోటళ్లలో పని చేసేవారు... ఇలా ఎంతోమంది కార్మికులు తెలంగాణలో ఉన్నారని, వారు మన రాష్ట్రం వారు కాకపోయినప్పటికీ కేసీఆర్ మానవత్వం చూపారన్నారు. వారు మన రాష్ట్రం కాకపోయినా మన అభివృద్ధిలో వారు భాగస్వాములు అని కేసీఆర్ అన్నారని వెల్లడించారు.
సీఎం అయ్యాక మాత్రమే కేసీఆర్కు కార్మికులపై ప్రేమ కలిగిందనుకుంటే పొరపాటు అని, 2004లో కేసీఆర్కు యూపీఏ హయాంలో తొమ్మిది నెలల పాటు కేసీఆర్కు ఏ పోర్ట్ఫోలియోను ఇవ్వలేదని, ఆ తర్వాత కూడా ఏరికోరి కార్మిక శాఖను తీసుకున్నారని కేటీఆర్ చెప్పారు. అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం 2005లోనే కేసీఆర్ కమిటీని వేశారన్నారు. ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ సాధన కోసం యూపీఏ నుంచి బయటకు వచ్చారని, దీంతో అసంఘటిత కార్మికులను సంఘటితం చేసే పని అసంపూర్తిగా మిగిలిపోయిందన్నారు. ఏడాది కాలంలో లక్షా నలభై వేల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి అసలు ఏం చేశాడని ప్రశ్నించారు.