RG Kar Incident: ఆర్జీ కర్ హత్యాచార కేసులో దోషి సంజయ్ కుమార్ కు జీవితఖైదు

- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ హత్యాచార ఘటన
- ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన సంజయ్ రాయ్
- రాయ్ ని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం
- నేడు శిక్ష ఖరారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ హత్యాచార కేసులో దోషి సంజయ్ రాయ్ కి శిక్ష ఖరారైంది. సంజయ్ రాయ్ కి కోల్ కతా సీల్దా కోర్టు జీవితఖైదు విధించింది. బీఎన్ఎస్ సెక్షన్లు 64, 66, 103/1 కింద సంజయ్ రాయ్ కి జీవితఖైదు విధించారు. మరణించేవరకు దోషిని జైలులోనే ఉంచాలని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. అతడికి రూ.50 వేల జరిమానా కూడా విధించారు.
అంతేకాదు, బాధితురాలి కుటుంబానికి రూ.17 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయితే, ఈ పరిహారం తీసుకునేందుకు మృతురాలి తల్లిదండ్రులు నిరాకరించారు. పరిహారం కాదు... మాకు న్యాయం కావాలి అని వారు స్పష్టం చేశారు.
గతేడాది ఆగస్టు 9న విధుల్లో ఉన్న ట్రైనీ వైద్యురాలిపై సంజయ్ రాయ్ అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్టు నిరూపణ అయింది. ఈ కేసులో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ పై కూడా అనుమానాలు కలిగాయి.
ఈ కేసులో తొలుత కోల్ కతా పోలీసులు విచారణ చేపట్టగా, అనంతరం సీబీఐ దర్యాప్తు సాగించింది. అన్ని ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం... పోలీసు వాలంటీరు సంజయ్ రాయ్ ని దోషిగా నిర్ధారించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ 120 మందికి పైగా సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకుంది.
శిక్ష ఖరారు సందర్భంగా.... ఇది అత్యంత అరుదైన కేసు అని, దోషికి ఉరిశిక్ష వేయాలని సీబీఐ వాదించింది. అయితే, అత్యంత అరుదైన కేసు అనే అంశంపై కోల్ కతా సీల్దా కోర్టు సీబీఐతో విభేదించింది.