Telugu States: దావోస్ లో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు.. ఫొటోలు, వీడియో ఇదిగో!

- వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రులు
- మంత్రులతో కలిసి స్విట్జర్లాండ్ పర్యటన
- జ్యూరిచ్ ఎయిర్ పోర్ట్ లో కలిసిన రెండు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అరుదైన కలయికకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విదేశీ పెట్టుబడుల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ కు వెళ్లారు. ఇదే సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేశ్ తో కలిసి దావోస్ కు వెళ్లారు.
విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, మంత్రులకు యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో విమానాశ్రయంలోనే ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చంద్రబాబు కలుసుకున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు. మంత్రుల బృందంతో కలిసి ఎయిర్ పోర్ట్ లో ఫొటోలు దిగారు. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు భుజంపై ఏపీ సీఎం చంద్రబాబు చేతులేసి, షేక్ హ్యాండ్ ఇస్తూ దిగిన ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. అనంతరం రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ఇరువురు సీఎంలు చర్చించుకున్నారు.
